పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతో..బాధిత కుటుంబానికి రూ.35లక్షల పరిహారం

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతో..బాధిత కుటుంబానికి రూ.35లక్షల పరిహారం
  • 20 ఏండ్ల తర్వాత అందించిన సింగరేణి యాజమాన్యం

కోల్ బెల్ట్​,వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో సింగరేణి కార్మికుడి కుటుంబానికి 20 ఏండ్ల తర్వాత రూ.35లక్షల నష్టపరిహారం అందింది. మంచిర్యాల జిల్లా నస్పూర్​లోని సుధానగర్​కు చెందిన  సింగరేణి కార్మికుడు రెడపాక నారాయణ శ్రీరాంపూర్​ఏరియా ఆర్కేన్యూటెక్​ బొగ్గు గనిలో  కోల్​ఫిల్లర్​గా  చేస్తూ 2005 అక్టోబర్​12న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పట్లో అతని పిల్లలు చిన్నవాళ్లు కావడంతో జాబ్ లో చేరేందుకు అర్హత లేకుండా పోయింది.

భర్తకు రావాల్సిన ఎంఎంసీ పరిహారం(మెటర్నిటి మెడికల్​ కాంపెన్సేషన్ ​) కోసం భార్య కమలమ్మ దరఖాస్తు చేసుకుని 20 ఏండ్లుగా సింగరేణి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను బాధితురాలు కమలమ్మ కలిసి తన గోడు చెప్పుకుంది. స్పందించిన ఎంపీ వెంటనే సింగరేణి సీఎండీ ఎన్​.బలరాంనాయక్​తో మాట్లాడి బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.  

ఈ క్రమంలో వెంటనే సింగరేణి బాధిత కుటుంబానికి రూ.35లక్షల చెక్కును అందజేసింది. తమ సమస్యను పరిష్కరించిన ఎంపీ వంశీకృష్ణకు రుణపడి ఉంటామని కమలమ్మ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.